అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వహించుకోవాలని సూచించింది. ఈనెల 17న బహిరంగ సభకు అనుమతినివ్వాలని గత వారం రోజుల క్రితమే అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు చిత్తూరు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అయితే అనుమతిని పోలీసులు నిరాకరించారు.
ఇప్పటికే కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నిర్వహించిన మహాపాదయాత్రను ప్రశాంతంగా నిర్వహించామని, బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని రెండు రోజుల క్రితం జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం సాయంత్రం బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1న అమరావతి నుంచి బయలు దేరిన పాదయాత్ర 45 రోజుల పాటు నాలుగు జిల్లాల గుండా కొనసాగి తిరుపతిలో మంగళవారం ముగించారు.