అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమ్మక్క- సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలని కోరారు. “మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు. సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనం” అని ఆయన అన్నారు. “అడవి బిడ్డల వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకలు ఈ దేవతలు. తెలంగాణాలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికే తలమానికమని, దేశం నలుమూల్లోని గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయానందకరం, భక్తి ముక్తిదాయకం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“మనదేశంలో కుంభమేళా తరవాత కోట్లాదిమంది ఈ జాతరకు ప్రతీసారీ తరలి వస్తున్నారంటే భక్తులు సమ్మక్క-సారలమ్మను ఎంతలా ఆరాధిస్తారో అవగతమవుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారం మేడారం గద్దె అని భక్తుల విశ్వాసం. ఈ జాతర ఆద్యంతం గిరిజన సంప్రదాయంతో నయనానందకరంగా.. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. తెలంగాణ వాసులతో పాటు దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడి, కరుణ కటాక్షాలతో చల్లగా చూడాలని” కోరుకున్నారు పవన్ కళ్యాణ్.