అమరావతి: నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని వెల్లడించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెనకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాటిచ్చానని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానని వెల్లడించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని అనుకున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉన్నది కాని అపరిమిత ధనం మాత్రం లేదన్నారు. వెంటనే అధికారం చేపట్టాలనేది తన ఆలోచన కాదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అన్నీ ఆలోచించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పారు. నాడు రాజధానిగా అమరావతిని ఒప్పుకుని ఇప్పుడు మూడు రాజధానులు అంటారా అని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు. రాజధానికి ఇన్నివేల ఎకరాలు అవసరం లేదని అప్పుడే చెప్పినట్లు వెల్లడించారు. జనసేన ఎమ్మెల్యేలు పది మంది ఉంటే గట్టిగా పోరాడే వాళ్లమన్నారు. గెలిచే అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు.