వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్’’ నినాదంతో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. దామోదరం సంజీవయ్యను అందరూ మరిచిపోయినా.. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచనతోనే ఈ సభకు ఆయన పేరు పెట్టామని చెప్పారు.
2014లో ఆరుగురు కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమైన ఈ పార్టీలో.. ఇప్పుడు కేంద్ర కార్యవర్గం 76కు చేరిందని, పార్టీ కార్యకర్తల బలం 3.26 లక్షలకు పెరిగిందని అన్నారు. 2019లో 137 సీట్లలో పోటీ చేస్తే 7.24 శాతం ఓటింగ్ పొందామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 శాతం ఓటింగ్ దక్కిందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో 1209 మంది సర్పంచులు జనసేన మద్దతుతోనే గెలిచారన్నారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారం చేపట్టే స్థాయికి పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పొత్తుల గురించి అసలు ఆలోచనే లేదని, భవిష్యత్తులో దీని గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో చాలామంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి అవకాశమే మరోసారి వచ్చిందని, యువత పోరాట పటిమపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బలంగా చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలుస్తున్నామని కొందరు అంటున్నారని, అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు.