వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేస్తామని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయడం జనసేన ప్రధాన లక్ష్యమన్నారు.
‘‘అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తాం. విశాఖ, విజయవాడను హైటెక్ నగరాలుగా అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభ్యుదయ రాజధానికి రూపొందిస్తాం. కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టి, రాయలసీమలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తెల్ల రేషన్ కార్డులందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం. సులభ్ కాంప్లెక్సుల్లో పనిచేసే ఉద్యోగాలు కాకుండా సొంత కాళ్లమీద నిలబడేలా.. ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం తరఫు నుంచి రూ.10 లక్షల ఇస్తాం. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే తీసుకొస్తాం’’ అని పవన్ చెప్పారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, పంట కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి జనసేన అండగా నిలుస్తుందని తెలిపారు. బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇస్తే.. ప్రభుత్వాన్ని కూలదోయడానికి పనిచేస్తామని, ఆ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపారు.