అమరావతి : విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5గంటల వరకు ఆయన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్పరం చేయడాన్ని ఆపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీక్షలో స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు, జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు.