అమరావతి : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమ్స్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం తిరుపతి పరిధిలోని రామానుజపల్లి జేఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరై.. ప్రజల నుంచి పవన్ కల్యాణ్ ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వాగ్భాణాలు సంధించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధుల విడుదల ఆగిపోయిందని ఆరోపించారు. డబ్బు, అధికారం ఉంచుకొని.. ఇతరులకు కాస్త గౌరవం ఇవ్వాలంటూ వైసీపీ నేతలకు పవన్ సూచించారు. ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీకి కొమ్ముకాయడానికి తాను సిద్ధంగా లేనని, ఏదో సామాజిక వర్గానికి మా పార్టీని అమ్మేయడమే మా పనా? అంటూ నిలదీశారు. దేశానికి మూడో ప్రత్యామ్నాయం కావాలని, ఆంధ్రప్రదేశ్లోనూ మూడో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. నగరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చాలాచోట్ల డ్రైనేజి వ్యవస్థ లేదని, 7వేలకోట్లుపైగా పంచాయతీ నిధులను దారి మళ్లించుకున్నారని ఆరోపించారు.
తిరుపతిలో జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం
మొదటి గంటలో 220కి పైగా సమస్యలు నమోదు#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/8SIBlt9RlJ
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2022
రాయలసీమలో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. సీమ ప్రజలు భయపడుతున్నంత కాలం.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందదన్నారు. రాజకీయ నేతలను చూసి భయపడి కాకుండా.. ప్రేమతో చేతులు కట్టుకోవాలని, ఆత్మగౌరవం లేకుండా ఎంతకాలం బతుకుదామని ప్రశ్నించారు. 2009లో కొద్ది మంది నేతల వల్ల పార్టీ పోగొట్టుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం వారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారన్నారు. కుళ్లు, కుంత్రాలను చిరంజీవి చూడలేకపోయారని, తట్టుకోలేకపోయారని, అందుకే ప్రజారాజ్యం ఉండలేకపోయిందన్నారు.
నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. తెలంగాణలోని మునుగోడులో పోటీ చేస్తే కొన్ని ఓట్లు వస్తాయని, దాంతో ప్రయోజనం ఉండదన్నారు. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటున్నామన్న పవన్.. సమయం వచ్చిన సమయంలో ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తామన్నారు. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దన్నదే ప్రస్తుతం తమ వ్యూహన్నారు. తమతో కలిసి ప్రయాణించాలనుకుంటే నేతలు ముందుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలన్నారు. ఎన్నికల కోసమే అయితే పార్టీలో చేరొద్దని స్పష్టం చేశారు.