అమరావతి: జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. నిజానికి రైల్వే ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఎప్పటికి పూర్తవుతుందని ఈ సందర్బంగా ప్రశ్నించారు. రైల్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో తేటతెల్లమైందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేయ లేదని, ఫలితంగానే ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు.. ఏపీ ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఆలస్యం అవుతున్నాయని తెలిపారు.
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైనుకు 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని అందించడంలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఫలితంగా ఈ రైల్వే లైన్ నిర్మాణం పనులు సాధ్యం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.358 కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే, నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1,351 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం-తుమ్కూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉన్నదని తెలిపారు.