ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పందించారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతోనే ముందుకు వెళ్తామని ప్రకటించారు. అయితే… బీజేపీతో తమ బంధం బలంగానే వుందని పవన్ స్పష్టం చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం కర్నూల్లో పర్యటించారు. కర్నూలు జిల్లా శిరివెళ్లి మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. దీని త్వరాత ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీతో తమ బంధం అద్భుతంగా వుందని చెప్పుకొచ్చారు.
ప్రజలకు ఉపయోగపడే పొత్తు ఏదైనా ఒకే అని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభాపేక్ష వుందని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చమని ప్రకటన చేయడానికి దాని పాలనా విధానమే కారణమని, అందుకే అలా అన్నట్లు వివరించారు. రోడ్లు, పరిశ్రమలు, నిరుద్యోగం, కరెంట్… ఇలా కోకొల్లలుగా సమస్యలు పేరుకుపోయాయన్నారు. దీని దృష్ట్యా అందరూ కలిసి రావాలని పవన్ అన్నారు.
బీజేపీ నేతలు జనసేనకు రోడ్మ్యాప్ ఇచ్చారా? అని ప్రశ్నించగా… ఇప్పుడే ఎలా చెబుతాం? వెనువెంటనే వ్యూహాలను ఎలా చెబుతాం? అని ప్రశ్నించారు. సరైన సమయం, పరిస్థితులను బట్టి కచ్చితంగా చెబుతాం అంటూ పేర్కొన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయం అవసరని, ఇది తన కోరిక అని తెలిపారు. అయితే.. ఈ ప్రత్యామ్నాయం కోసం ఎవరెవరు కలిసి వస్తారో తనకూ తెలియదన్నారు.
ఇక టీడీపీతో పొత్తు వుంటుందా? అన్న ప్రశ్నకు … రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతోనే ముందుకు వెళ్తామని ప్రకటించారు. పొత్తుపై మాత్రం నేరుగా సమాధానం ఇవ్వలేదు.
తామేమీ ఒంటరిగా పోరాటాలు చేయడం లేదని, బీజేపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కచ్చితంగా ఉంటుందని, కచ్చితంగా చేస్తామని పవన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా చేస్తారో చెప్పండనగా… ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.