Pawan Kalyan | పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. మంగళవారం జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన కార్యనిర్వాహక సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, ఒంటరిగా నిర్ణయం తీసుకోనని, పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తానని కూడా హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవచ్చు కదా.. అంటూ పలు పార్టీలు మనల్ని కోరుతాయని, అయినా.. తొందర పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలన్నారు.
రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆయా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతుంటాయని, ఆ మైండ్ గేమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పావులు కాకూడదని పవన్ పార్టీ నేతలను హెచ్చరించారు. పొత్తులపై ఒక్కో మాట మాట్లాడకూడదని, అందరమూ ఒకే పల్లవిని ఎత్తుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సంస్థాగతంగా ఇప్పుడిప్పుడే బలపడుతున్నామని, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని ఆయన పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సభలో పొత్తుల విషయాన్ని మరింత లోతుగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎన్నికలు రాకమునుపే ఏపీలో పొత్తులపై చర్చలు జరిగిపోతున్నాయి. దీనికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు కుప్పం వేదికగా మొదటగా ఆజ్యం పోశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతాయన్న ప్రచారం జరుగుతోందని పలువురు ప్రస్తావించారు. దీనికి బాబు సమాధానమిస్తూ.. లవ్ వన్సైడ్ ఉంటే సరిపోదని, రెండు వైపులా ఉండాలని చమత్కరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీలోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. ఈ విషయాన్ని ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు.
అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీతీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. అవసరం కోసం చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని ఎద్దేవా చేశారు. అవసరం తీరిపోయాక విడిచిపెడతారని మండిపడ్డారు. 1996 నుంచి చంద్రబాబు అందర్నీ లవ్ చేస్తూనే వున్నారని సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.