తిరుమల : ఎస్వీ ఉన్నత పాఠశాలను దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, దానికి గురుపూజ దినోత్సవం రోజున నాంది పలకడం సంతోషకరమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో చక్కటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడ ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నదని చెప్పారు. విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. తిరుమలకు విచ్చేసే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి ముందుగానీ, తర్వాత గానీ ఈ పాఠశాలను సందర్శించాలని కోరారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న ఎస్వీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రేమాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం పలు ప్రాంతాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారని, వీటిలో దేశంలోనే అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం సింఘానియా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రేవతి శ్రీనివాసన్ పలు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారని వెల్లడించారు. తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలను అకడమిక్స్ పరంగా అభివృద్ధి చేయడానికి సింఘానియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి గౌతమ్ సింఘానియా సమ్మతించారని తెలిపారు. సింఘానియా ట్రస్టు పాఠశాల ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని సమీక్షిస్తుందని చెప్పారు.
రేమండ్స్ గ్రూపు సీఎండీ గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ.. ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మించే అపూర్వమైన అవకాశం తమకు దక్కిడం తమ పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ అవకాశం ఇచ్చిన టిటిడి బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. 47 సంవత్సరాలుగా తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నానని, తిరుమల యాత్ర తన జీవితంలో ఒక భాగంగా మారిందని చెప్పారు. 52 ఏండ్ల క్రితం అప్పటి రేమండ్ గ్రూప్ ఛైర్మన్ సతీమణి శ్రీమతి సులోచనాదేవి సింఘానియా కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ సమయంలో అందిన ప్రమాద ఇన్సూరెన్స్ మొత్తం లక్ష రూపాయలను వారి కుటుంబ సభ్యులు సామాజిక హిత కార్యక్రమానికి ఖర్చు పెట్టాలని కోరారన్నారు. ఈ విధంగా లక్ష రూపాయల మూలధనంతో సులోచనా దేవి సింఘానియా పాఠశాల స్థాపన ప్రారంభం కావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ.. తానూ ఈ పాఠశాల విద్యార్థినేనని చెప్పారు. వినయంతో కూడిన విద్య అవసరమని, స్వామివారి ఆశీస్సులతో విద్యార్థులందరూ వృద్ధి చెందాలని కోరారు. అంతకుముందు ఈఓ ధర్మారెడ్డి, గౌతం సింఘానియా కలిసి పాఠశాలలో పూజలు నిర్వహించి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో సంపంగి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్ఈ-2 జగదీశ్వర్రెడ్డి, వి ద్యాశాఖాధికారి గోవిందరాజన్, డిప్యూటీ ఈఓ రామారావు, సింఘానియా ట్రస్టు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రేవతి శ్రీనివాసన్, వీజీఓ బాలిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, సింఘానియా ట్రస్టు ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.