తిరుపతి : స్విమ్స్ దవాఖానను దేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా తయారుచేయడంలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో పారా సిబ్బంది పాత్ర కూడా అంతే ముఖ్యమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అన్నారు. రోగికి సంతృప్తికర వైద్యం అందాలన్నా, త్వరగా కోలుకోవాలన్నా డాక్టర్లతోపాటు పారామెడికల్, ఇతర సిబ్బంది కూడా ముఖ్యమన్నారు. దవాఖానలో ఎంతో అనుభవం సాధించిన వీరంతా ప్రజల్లో స్విమ్స్ పట్ల మరింత విశ్వాసాన్ని పెంచడానికి కృషి చేయాలని కోరారు. స్విమ్స్ ఆస్పత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్యోగులతో ఏవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీలో పనిచేస్తున్న 8500 మంది ఉద్యోగులు, దాదాపు 9 వేల మంది పెన్షనర్లు వైద్యం కోసం స్విమ్స్కు రావాలనే వాతావరణం కల్పించాలని కోరారు. స్విమ్స్కు అవసరమైనంత సిబ్బంది, మిషనరీ, ఇతర సదుపాయాలు టీటీడీ కల్పిస్తుందన్నారు. డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందే వారి కోసం 30 ప్రత్యేక గదులు ప్రారంభించామని, నెల రోజుల్లో మరో 60 గదులు సిద్ధం అవుతాయని చెప్పారు. స్విమ్స్ దవాఖానలో వైద్య సేవలు భేషుగ్గా ఉన్నా ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రి కోసం రూ.5 కోట్లతో ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేయిస్తున్నామని, వచ్చే నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు.