తిరుమల : కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను ఈ నెల 27న ప్రారంభిస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం తెలిపారు. తిరుపతి డీపీడబ్ల్యూ స్టోర్లోని తయారీ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. టీటీడీ గో సంరక్షణకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీకి పూనుకుందని చెప్పారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ప్రత్యేక శ్రద్ధతో తక్కువ సమయంలో ఉత్పత్తుల తయారీ సాకారమైందన్నారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించేందుకు సైతం ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు పలు ఆసుపత్రులతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.