అమరావతి: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి ముఖ్యంగా గోదావరి నది ద్వీప గ్రామాలను ధ్వంసం చేశాయి. ఉగ్ర గోదావరి ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పదుల సంఖ్యల్లోని గ్రామాలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను నెలకొల్పింది. వరద బాధితులకు ఆర్థిక సాయంతోపాటు రేషన్ అందివ్వాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం జగన్ ఆదేశించారు.
ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం గత వారం 25 లక్షల క్యూసెక్కుల మార్కును దాటింది. ఆగస్టు 2006 తర్వాత ఈ బ్యారేజీ వద్ద అత్యధికంగా నీరు విడుదలైంది. అల్లూరి సీతారామ రాజు, పశ్చిమ గోదావరి ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వరద బీభత్సం నెలకొంది. ఈ జిల్లాల్లోని 54 మండలాల పరిధిలోని 405 గ్రామాలు, ముఖ్యంగా లంకలుగా పిలిచే ద్వీప గ్రామాలు ఇంకనూ నీటిలోనే ఉన్నాయి. పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పదకొండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మోహరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద ప్రభావిత జిల్లాల్లో 218 సహాయ శిబిరాలను ప్రారంభించింది. ఇక్కడ 1,42,688 మంది తలదాచుకున్నారు. ప్రభుత్వ డాటా ప్రకారం, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 1,017 మందిని రక్షించగా.. ముంపునకు గురైన గ్రామాల నుంచి దాదాపు 10,531 మందిని తరలించారు. వరదల కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. రానున్న 48 గంటల్లో వరద బాధితులందరికీ రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు రేషన్ సరుకుల పంపిణీని చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. వరద కారణంగా 2,070.88 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 8624.21 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి వరదల కారణంగా 988.40 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.