విజయవాడ: తమ ప్రభుత్వ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గత రెండున్నరేండ్ల కాలాన్ని మహిళాభ్యున్నతి కోసమే వినియోగించామన్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చి మహిళల సాధికారతకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతీ ఒక్క అక్క, చెల్లెండ్లకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
మహిళలు రాజకీయంగా ఎదగాలన్న తపనతో 51 శాతం పదవులు వారికి కేటాయించాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. ఇలా చట్టం తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం తమదేనని చెప్పారు. జెడ్పీ ఛైర్పర్సన్లుగా 54 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పా. 13 జెడ్పీల్లో ఏడుగురు మహిళలే ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్లుగా 64 శాతం మహిళలే ఉన్నారని, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాల కారణంగానే మహిళా సాధికారత సాధ్యమవుతున్నదని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీలోని మహిళలకు దక్కిందని అన్నారు. జగన్కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, నగరి ఎమ్మెల్యే రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.