అమరావతి : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సీడ్ కంపెనీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపదల చేశారు. సెజ్లోని పరిశ్రమలకు రెండ్రోజులు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనపై నివేదిక వచ్చేంతవరకు కార్యకలాపాలు నిలిపివేయాలని వెల్లడించింది.
నిన్న కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ అయి సుమరు 3 వందల మందికి పైగా మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు, తలనొప్పితో బాధపడుతూ రోడ్లపైకి పరుగులు తీశారు. స్థానికులు, సంస్థ యాజమాన్యం స్పందించి బాధితులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేయడంతో ప్రాణాపాయం తప్పింది.
కాగా ఘటన విషయం తెలియగానే ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం ఎస్ఈజెడ్లోని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి గ్యాస్ లీక్ పై ఆరా తీశారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామని, ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.