తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు.
దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్పోర్టులోనే శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్టు , తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందురోజు తిరుమలకు వచ్చి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.
ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎయిర్పోర్టు డీజీఎం టెర్మినల్ చంద్రకాంత్, కమర్షియల్ మేనేజర్ అవినాష్, టెర్మినల్ మేనేజర్ మణిదీప్, టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.