AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ ఫోకస్ మొత్తం వైజాగ్పైనే ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ కేంద్రంగానే పరిపాలన చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో వైజాగ్ ఒక్కటే రాజధానిగా ఉంటుందా? అనే సందేహంలో ఉన్న ఈ సమయంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు దీనికి ఊతమిస్తున్నాయి. వైజాగ్ మాత్రమే ఏపీ రాజధాని అంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మీడియా ముందుకొచ్చి వివరణలు ఇస్తున్నారు. మూడు రాజధానులపై నెలకొన్న సందేహాలకు క్లారిటీలు ఇచ్చే పనిలో పడ్డారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ చేస్తామని ప్రకటించారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వైజాగ్ను కార్యనిర్వహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. దీన్ని వ్యతిరేకించిన విపక్షాలు కోర్టులో కేసు వేశాయి. ఈ విచారణ కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ నుంచి పరిపాలన చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్లో నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారం కోసం బెంగళూరులో నిర్వహించిన రోడ్ షోలో ఏపీ మంత్రి బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాష్ట్ర పరిపాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారం అని అన్నారు. కర్ణాటకలో మాదిరి ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. బుగ్గన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. దీంతో దీనిపై మిగిలిన మంత్రులు క్లారిటీ ఇచ్చారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైజాగ్ పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలను ఎల్లో మీడియా కన్ఫ్యూజ్ చేస్తుందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం కావాలనే కొందరు వింత వాదనలు చేస్తున్నారని.. ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ విధానమని తెలిపారు. మూడు రాజధానుల విషయంలో సందేహం అక్కర్లేదని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను నిర్ణయించామని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెడితే ప్రాంతాల మధ్య చిచ్చు రావడం సహజమని అభిప్రాయపడ్డారు. అందుకే మూడు రాజధానులకు అనుకూలంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం, శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగానే మూడు రాజధానుల అమలుకు జగన్ సర్కార్ సిద్ధమైందని స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత