తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లను మంగళవారం టీటీడీ వెబ్ సైట్ లో పెట్టింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు.
ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని సంబంధిత అధికారులు భక్తులకు సూచించారు. మిగతా భక్తులు టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చని స్పష్టం చేసింది.
మకర వాహనంపై కపిలతీర్థ విభుడు దర్శనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో పార్థ సారధి, సూపరింటెండెంట్ భూపతి, భక్తులు పాల్గొన్నారు.