తిరుపతి : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అధికారులు ఆన్లైన్లో ఎల్లుండి టికెట్లను విడుదల చేస్తున్నారు. నవంబర్ నెలకు సంబంధిన టికెట్లను ఉదయం 9గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రూ. 300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నామని వివరించారు. ఈనెల 22న అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామిని దర్శించుకునేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుంది.
నిన్న తిరుమల శ్రీవారిని 88,924 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,282 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.