తిరుమల : నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన మొత్తం 2.20 లక్షల టికెట్లను ఆన్లైన్లో శనివారం అందుబాటులో ఉంచగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ప్రారంభమైన 40 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
ఇది తెలియక భక్తులు గంటల తరబడి వెబ్సైట్లో టిక్కెట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 2 న వైకుంఠ ఏకాదశి, 3 న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది.