అమరావతి : హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలో అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని టీడీపీ నాయకులు భావించారు. ఇందుకోసం అన్న క్యాంటీన్ షెడ్ను నెలకొల్పారు. దీనిని పోలీసులు ,మున్సిపల్ సిబ్బంది రాత్రికి రాత్రే బుల్డోజర్ల సహాయంతో తొలగించారు. మున్సిపల్ సిబ్బంది వైఖరిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాంటిన్ను తొలగించినప్పటికీ అన్నదానం చేయాలని ప్రయత్నిస్తున్న కృష్ణా-గుంటూరు జిల్లా టీడీపీ నాయకులను శుక్రవారం ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదల ఆకలి తీరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిమితికి లోబడి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.
పేదవాడికి అన్నం పెట్టడానికి ఎవరూ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, విజయవాడలో వర్ల రామయ్య, మంగళగిరిలో స్థానిక నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.