అమరావతి : ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని వైసీపీ మినహ రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలన్నీ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. స్లాబ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కడప, విజయవాడ, గుంటూరు జిల్లా కేంద్రంలో జనసేన నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
కడపలో టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం తప్పుడు విధానాలతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో అర్థం కావడం లేదని పేర్కొంటూ ఇంటింటికి వెళ్లి కొవ్వొత్తులు పంపిణీ చేశారు.
రాజమహేంద్రవరంలో డీలక్స్ సెంటర్లో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గొరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కట్టెలపొయ్యిపై నీళ్లో పూరీలు వేస్తూ వింత నిరసన తెలిపారు.