Srisailam | శ్రీశైలంలో జ్యోతిర్లింగమై వెలసిన శివ పరమాత్మునిపై శుద్దమైన భక్తి కలిగి ఉండి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు సులభంగా పొందవచ్చునని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవాచకులు దివి హయగ్రీవాచార్యులు అన్నారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధానాలయ మాడవీధిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా శివానందలహరి గ్రంధంలో ఆది శంకరాచార్యులవారు శివతత్వం గురించి ప్రస్తావంచిన విశేషాలను భక్తులకు హాయగ్రీవాచార్యులు వివరించారు. శివ పరమాత్ముని పూజించేందుకు నిస్వార్థమైన శుధ్ద భక్తిని కలిగి ఉండటం అంటే ఏమిటని తెలిపారు. ప్రతి ఒక్కరూ శివానందలహరి గ్రంధ పఠనాన్ని చేయడం వలన శ్రీశైల క్షేత్ర మహత్యంపై పలు విషయాలు తెలుసుకోవచ్చునని అన్నారు.
అదే విధంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ భరణి నాట్య బృందం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సంప్రదాయ నృత్య నివేదన చేశారు. ప్రదర్శన చేసిన వారిలో రాగిణి, సంయుక్త, నిత్యశ్రీ, శ్వేత, మానస, వైష్ణవి, శ్లోక తదితరులు ఉన్నారు.