అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీర్ విగ్రహాన్ని వైసీపీ నాయకుడు కుమారుడు సుత్తితో కొట్టడంతో కొద్దిపాటు ధ్వంసానికి గురైంది. ఈ చర్యను నిరశిస్తూ గుంటూరులోని చంద్రమౌళినగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు.
పల్నాడు ప్రాంతంలో ఆందోళన నిర్వహించిన టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబు , ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నాయకుల అరెస్టు సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది . నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద బాబును గృహ నిర్బంధం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం తెలుగుజాతిని అవమానించినట్లే నని అన్నారు. ఈ సంఘటన పట్ల తెలుగు జాతి ఊరుకోదని, దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.