అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరుపాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాలను హైదరాబాద్ లో, మే నెలలో మహానాడు విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని సమావేశంలో పాల్గొన్న మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలను టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, ఆర్థిక దుస్థితిపై చర్చించామని, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలిచేందుకు రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించామని చెప్పారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆవేదనతో ఉన్నారని, వారికి ప్రభుత్వ సహాయాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పంచాయతీ నిధుల మళ్లింపు, చెత్త పన్ను, సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, ప్రచారయావతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గడిచిన మూడేండ్ల కాలంలో మహిళలపై అమనావీయ సంఘటనలు వేలసంఖ్యలో జరిగాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించామనని వివరించారు. వివేకా హత్య కేసులో సత్యాన్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వివేకా హత్య కేసులో అసలు సూత్రదారులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.