సూర్యాపేట: ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని పొట్టనపెట్టుకున్నది. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుని తమవారితో ఆనందంగా గడుపుదామని అనుకున్న వారింట.. విగతజీవులుగా మారడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర సంఘటన బుధవారం తెల్లవారుజామున తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ ఎన్నారై జంట ప్రయాణిస్తున్న కారు కల్వర్లు గోడను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి వారు అక్కడికక్కడే కన్నుమూశారు. వారి ఇద్దరు పిల్లలు గాయాలతో బయటపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పరిధిలోని రెడ్డిగూడెంకు చెందిన బరాదర్ హేమమ్, రజిత దంపతులు. గత కొన్నేండ్లుగా ఆస్ట్రేలియాలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏండ్ల తర్వాత వారు సొంతూరుకు బయల్దేరి వచ్చి మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. అక్కడ ఓ ట్యాక్సీని మాట్లాడుకుని కృష్ణాజిల్లా రెడ్డిగూడెంకు బయల్దేరారు. గునపాల గ్రామ సమీపానికి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారి ఇద్దరు పిల్లలను, డ్రైవర్ను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. మరో రెండు గంటల్లో ఇంటికి చేరుతామనగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్కు నిద్రమత్తుగా ఉండటం వల్లనే అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీ కొట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని సూర్యాపేట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.