అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీలు తమ ప్రాంత అభివృద్ధి గురించి ఏపీ సీఎం జగన్ వద్ద ప్రస్తావించిన దాఖలాలు లేవని, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్ధులని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం అందిస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు తమ ఘనతగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుం టుందని విమర్శించారు.
కాకినాడలో పెట్రో కెమికల్స్, గెయిల్ నిర్మాణాలకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిందని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కేంద్రం ఏడు సంవత్సరాల్లో జాతీయ రహదారులకు 35వేల కోట్ల రూపాయలు ఇవ్వడంలో వైసీపీ ఎంపీల పాత్ర ఏమీ లేదని అన్నారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే సంస్కారం లేదని ఆయన పేర్కొన్నారు.
గత సంవత్సరం 75వేల కోట్లు ఏపీకి అన్ని రకాలుగా వచ్చాయని తెలిపారు. ఇందులో 25వేల కోట్లు గ్రాంట్ల రూపేణా వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎలాంటి చొరవ తీసుకుని పరిష్కారించారని ప్రశ్నించారు.