ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పాలన అందించే వీలున్నదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ జనరల్ సంతోష్ మెహ్రా ప్రశంసించారు. ఇలాంటి వ్యవస్థ ద్వారానే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందే అవకాశం దక్కుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయన.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును కలిశారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల సచివాలయాలను ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జీ శ్రీనివాసరావుతో కలిసి ఎన్హెచ్ఆర్సీ బృందం సందర్శించింది. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల విధులను సంతోష్ మెహ్రా బృందానికి కలెక్టర్ వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలిపారు. అవినీతి, వివక్షకు తావులేకుండా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ / వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే పలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు ఇచ్చిన 72 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మహిళల భద్రత కోసం ఉద్దేశించిన దిశ యాప్ను కూడా సంతోష్ మెహ్రా సమీక్షించారు. దిశ యాప్ని ఉపయోగించగా మంగళగిరిలోని దిశా కంట్రోల్ స్టేషన్కు కాల్ను స్వీకరించిన తీరు, సందేహాలకు స్పందించడం పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు. ప్రజలు గ్రామ / వార్డు సచివాలయాల వ్యవస్థను వినియోగించుకోవాలని ఆయన కోరారు. సంతోష్ మెహ్రా బృందం వెంట జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.