విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను ఉగాది అవార్డులిచ్చి సత్కరించేందుకు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రైతులు కొత్త ఆవిష్కరణల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకు ఏటా అవార్డులు అందజేస్తున్నారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల సృష్టికర్తలుగా ఉన్న రైతులకు ఈ ఏడాది ఉగాది అవార్డులను బహూకరించేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ పీ రాంబాబు ఒక ప్రకటనలో సూచించారు.
రైతులు తమకు సమీపంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల్లో దరఖాస్తులను అందజేయవచ్చు. దరఖాస్తులకు అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి ఈ నెల 16వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిభ కనబరిచిన రైతులకు అవార్డుతోపాటు రూ.5 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.angrau.ac.in లో సంప్రదించవచ్చు.