అమరావతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమయ్యింది . రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు.. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. 60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంగా నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్యార్డ్కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు.