ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. గన్ కంటే ముందే వచ్చేస్తానన్న సీఎం జగన్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఏపీలోని కడప జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై స్పందిస్తూ.. లోకేశ్ పై విధంగా పేర్కొన్నారు. గన్ కంటే ముందే వచ్చేస్తానంటూ సీఎం జగన్ డబ్బులు వెచ్చించి, ప్రచారాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనే ఓ దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే జగన్ ఎక్కడ? అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంత కాలంగా ఓ యువకుడితో సహా 10 మంది ఇతరులు పదే పదే అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత జరిగినా పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలున్నాయి.