మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి పెళ్లిళ్లకు హాజరవుతున్నారంటూ టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (Nara Lokesh) ధ్వజమెత్తారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయని, చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లోకేష్ చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలబడాల్సిన గౌరవనీయమైన ముఖ్యమంత్రి… అలా చేయకుండా ఇలా వరుసపెట్టి పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు. రాయలసీమను కాపాడండి’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతుంటే ఇసుక అమ్మకం గురించి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు.