Nara Lokesh | దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో ఒక వార్త ప్రచారం జరుగుతోంది. పులివెందులలో జగన్ను కలిసేందుకు ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వీఐపీ పాస్లు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్కు నివాళులర్పించేందుకు సోమవారం వైఎస్ జగన్ పులివెందులకు వచ్చారు. ఈ క్రమంలో పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘ ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడు వినలే..! చూడలే! ‘ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు.