Srisailam | శ్రీశైలం/నంద్యాల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని 12 జోన్లుగా విభజించి ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు చోటు చేసుకున్నా తెలుసుకునేలా ఉన్నతాధికారులను నియమించారు. ఆ వివరాలను కమాండ్ కంట్రోల్ రూం నుంచి జిల్లా కలెక్టర్ కె. శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్కుమార్ రెడ్డి ఎప్పటిప్పుడు తెలుసుకుంటున్నారు.
ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగు నీరు, పార్కింగ్ ప్రదేశాలు, భక్తుల ఉచిత దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాద కౌంటర్లు, శివదీక్షా శిబిరాలు, ఉద్యానవనాలు తదితర ముఖ్య ప్రదేశాలలో రద్దీ చోటు చేసుకోకుండా తమ సూచనలు ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని జోన్లలో చర్యలు చేపట్టాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రపరిధిలోని అన్ని ప్రాంతాలలో దాదాపు వెయ్యి మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులతో మూడు షిప్టులలో నిరంతరాయంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా సింటెక్స్ ట్యాంకులను ఎప్పటికప్పుడు నీటితో నింపుతూ భక్తులకు అందుబాటులో ఉంచాలని దేవస్థాన అధికారులను ఆదేశించారు.
అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలో 13 చోట్ల తాత్కాలిక అత్యవసర ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు 30 పడకల ఆసుప్రతి ఏర్పాటు చేసి భక్తులకు కల్పిస్తున్న వైద్యసదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. పాగాలంకరణకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై పరిశీలిస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దేవస్థాన ఈవోను కలెక్టర్ ఆదేశించారు అలాగే స్వామివార్ల కళ్యాణోత్సవానికి కూడా పటిష్ట ఏర్పాట్లు చేసుకుని భక్తులు వీక్షించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.