Srisailam | శ్రీశైలం : ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ వెల్లడించారు. 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలంలో మంగళవారం పోలీస్, లైజనింగ్ అధికారులతో భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి హెలిపాడ్కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు.. ఆయన పర్యటించే ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
కీలక ప్రాంతాలు, కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్ ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని పది సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కో ఉన్నతాధికారిని ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఉంటుందని.. రోడ్డు మార్గాలు, కీలక కూడళ్లు, ఆలయ ప్రాంతాల్లో రూప్టాప్ సిబ్బందిని నియమించి వారికి బైనాక్యులర్తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. 24/7 కొనసాగించాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని.. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.
హెలీపాడ్, గుడి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలలో యాక్సెస్ కంట్రోల్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కోసం రూప్ టాప్, క్యూఆర్టీ, స్పెషల్ పార్టీలను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన సుమారు 1800 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రత్యేకమైన డ్యూటీ పాసులను జారీ చేసినట్లు చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడీ కార్డులు ధరించాలని సూచించారు.