Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో త్రయోదశి సందర్భంగా బుధవారం (19.06.2024) నాడు నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చన జరిపించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజుల్లో నందీశ్వర స్వామికి దేవస్థాన సేవగా ఈ కైంకర్యం జరిపిస్తున్నారు. ప్రతి నెలలోనూ త్రయోదశి రోజుల్లో శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వర స్వామికి భక్తులు పరోక్ష పూజ జరిపించే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. బుధవారం మొత్తం 27 మంది భక్తులు నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేష పూజ జరిపించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర రాష్ట్రాల భక్తులు ఈ విశేష పూజ నిర్వహిస్తున్నారు. ఈ పూజాదికాల్లో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజ జరిపించారు.
తదుపరి నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్సోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహించారు. అటుపై నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
పురుష సూక్తం, వృషభ సూక్తం తదితర మంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేష అభిషేకం నిర్వహించారు. తదుపరి నందీశ్వర స్వామికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చన జరిపించారు. తర్వాత నందీశ్వర స్వామి వారికి నానబెట్టిన శనగల నైవేద్యం సమర్పించారు. చివరిగా స్వామికి నివేదన సమర్పించారు. త్రయోదశి నాడు జరిపే నందీశ్వర స్వామి వారి పరోక్ష సేవకు భక్తులు ఆన్ లైన్ ద్వారా రూ.1,116 సేవా రుసుము చెల్లించాలి. భక్తులు తమ సేవా రుసుము www.srisailadevasthanam.org, aptemples.ap.gov.in ద్వారా చెల్లించవచ్చు.
నందీశ్వర స్వామి వారి ఆరాధన వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. రుణ బాధతలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొన్నారు. అలాగే స్వామి వారికి నానబెట్టిన శనగలు సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని పురాణాలు చెబుతున్నారు. అందుకే నందీశ్వర స్వామికి శనగల బసవన్న అనే పేరు ప్రసిద్ధి.
ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికి వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తారు. సేవాకర్తలే కాక భక్తులంతా వీటిని శ్రీశైల టీవీ లేదా యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. కనుక భక్తులంతా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈవో పెద్దిరాజు కోరారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351, 83339 01352, 83339 01353 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.