అమరావతి : నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం కుప్పం నియోజక వర్గం కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో చికిత్స కోసం హుటాహుటినా కుప్పం ఆస్పత్రికి తరలించారు.
కుప్పంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ విషయం తెలుసుకుని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా ‘యువగళం’ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది