అమరావతి : కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడినే అతడిని చంపానని పోలీసులకు ఆయన వివరించాడు. ఏపీలోని కాకినాడలో డ్రైవర్ హత్య కేసు గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న విషయం తెలిసిందే.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ని పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రజా , ఎస్సీ సంఘాలు, ప్రతిపక్ష, వామపక్ష సంఘాల నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు తప్పని పరిస్థితుల్లో నిన్న రాత్రి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో డీఐజీ పాలరాజు సమక్షంలో విచారించారు. ఈ విచారణలో భాగంగా జరిగిన ఘటన వివరాలను ఎమ్మెల్సీ వివరించాడు. ఎమ్మెల్సీ అరెస్ట్ వివరాలను డీఐజీ అధికారికంగా సాయంత్రం వెల్లడిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.