ఎన్టీఆర్ జిల్లా : ముప్పాళ్లపాడు మహిళా రైతులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. పవర్ గ్రిడ్ సంస్థకు ఇచ్చిన భూములకు పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చందర్లపాడు-నందిగామ రోడ్డుపై మహిళా రైతులు బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. మూడేండ్ల క్రితం పరిహారంగా వచ్చిన మొత్తాన్ని ఒక వ్యక్తి తన ఖాతాలో వేసుకుని తమకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
ముప్పాళ్ల పవర్ గ్రిడ్ సంస్థకు చందర్లపాడు మండలం పరిధిలోని ముప్పాళ్లపాడు రైతులు తమకు చెందిన 10 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ భూములకు ఇంతవరకు నష్టపరిహారం అందకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మహిళారైతులు చందర్లపాడు-నందిగామ ప్రధానరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని, న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరుగడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
తమ భూములకు చెందిన పరిహారాన్ని ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన ఖాతాలో వేసుకున్నట్లు మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఆయన నుంచి తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేసమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును మహిళా రైతులు అడ్డుకున్నారు. మూడేండ్లుగా తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని వారు చెప్పారు. సమస్యను పరిష్కరించకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.