Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. తనతో పాటు తన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరుతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అనే దానిపై స్పష్టత లేదన్నారు.
వైసీపీలో చేరాలని ఆ పార్టీ నేతల నుంచి తనకు పిలుపు వచ్చిందని ముద్రగడ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్కు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జగన్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. మళ్లీ రాబోయేది వైసీపీ ప్రభుత్వమే.. ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తాను. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వాలని ఎలాంటి కండీషన్ పెట్టలేదు. ప్రజలకు సేవ చేసేందుకే వైసీపీలోకి వెళ్తున్నాను. ఆ భగవంతుడి దయతో మళ్లీ జగన్ సీఎం కావాలి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ఏదైనా పదవి ఇస్తే తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు తనకు గానీ, తన కుమారుడికి గానీ ఎలాంటి సీట్లు అడగలేదన్నారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. జగన్ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక కూడా అడగను. జగన్ తనంతట తానే ఇస్తే పదవులను స్వీకరిస్తాను అని ముద్రగడ స్పష్టం చేశారు.