కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇలా చేయడం వల్ల ఏపీ లాంటి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని విరుచుకుపడ్డారు. సభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగానే ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఏపీని బలిస్తారా? అంటూ సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో చాలా రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా… కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. తాము కేంద్ర మంత్రులకు ఈ విషయంపై అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. తమ ఎంపీలది అరణ్య రోదనే అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్రమైన నష్టాల్లో వుందని కేంద్రం పదే పదే చెబుతోందని, ఆ నష్టాల నుంచి సంస్థను బయటపడేయడానికి కేంద్రం ఏనాడు చిత్తశుద్ధితో లేదని విమర్శించారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దని తాము మొత్తుకున్నా.. ఏమాత్రం లెక్కచేయకుండా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తున్నారని, ఇది ఏపీ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. అంతర్జాతీయంగా ఉక్కుకు మంచి డిమాండ్ ఉందని, విశాఖ ఉక్కు కూడా లాభాల్లోనే వుందని, ప్రైవేటీకరణ అన్న ఆలోచన నుంచి కేంద్రం తప్పుకోవాలని ఎంపీ విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు.