అమరావతి : ఏపీలోని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తు పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానితో పాటు ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదలించడం కోసం తాను నిర్ణయం తీసుకోబోతున్నానని పేర్కొన్నారు.
తమ పార్టీకి చెందిన ఎంపీలు తనపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారని, అనర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. వారి ప్రయత్నాలకు ఇంకా సమయం ఇస్తున్నానని అనర్హత వేటు వేయించకపోతే తానే రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికలకు వెళ్తానని రఘురామ వెల్లడించారు. పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని పేర్కొన్నారు.