చీరాల: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఆందోళనలు మిన్నంటాయి. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని.. డివిజన్ కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు గత 36 రోజులుగా దీక్ష చేస్తున్నారు. తమ గోడును చెప్పుకుందామని వెతికితే మా ఓట్లతో ఎన్నికైన ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి కనిపించడం లేదని, కాస్తా వెతికిపెట్టాలంటూ జేఏసీ నేతలు కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మా సమస్యలు చెప్పుకుందామంటే వినే నాధుడు కరవయ్యారని పట్టణ విశ్రాంత ఉద్యోగిని రమణమ్మ, జేఏసి నాయకులు వాపోయారు. మా ఓట్లతో గెలుపొంది ఎంపీ అయిన ఆదాల ప్రభాకర్రెడ్డి గత కొంతకాలంగా కందుకూరు ప్రజలకు కనిపించడం లేదని, మీరైనా ఆయనను వెతికి పెట్టాలని పోలీసులను కోరుతూ వినతిపత్రం అందజేశామని చెప్పారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఎంత మంది నాయకులకు, అధికారులకు విన్నవించినా సరైన రీతిలో స్పందించడం లేదని వారు వాపోయారు. అందుకే ఎంపీకి తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు నిర్ణయించుకున్నామని, అయితే ఎంపీ ఆదాల కనిపించకుండా పోవడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జేఏసీ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, బెజవాడ ప్రసాద్, రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.