విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్క్ (ఐజీజెడ్పీ) అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐజీజెడ్పీ, ఐఓసీఎల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ పర్యావరణ బాధ్యతలో భాగంగా, ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తున్నది. ఇందిరాగాంధీ జూవాలాజికల్ పార్క్లో రూ.1.88 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐఓసీఎల్ అంగీకరించింది.
ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ కుమార్, ఐజీజెడ్పీ క్యూరేటర్ నందనీ సలారియా అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. జూలో రైనో నైట్ హౌస్ ఎన్క్లోజర్ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి పనులలో జంతు సంక్షేమం, సందర్శకుల సౌకర్యాలు, సంరక్షణ విద్య, హిమాలయన్ బ్లాక్ బేర్ కోసం నైట్ హౌస్, స్ట్రిప్డ్ హైనా, ఖడ్గమృగాలకు అదనపు నైట్ హౌస్, సీటింగ్ బెంచీలు, ల్యాండ్స్కేపింగ్, పబ్లిక్ టాయిలెట్లు, బయోస్కోప్ అప్గ్రేడేషన్, డస్ట్బిన్ల ఇన్స్టాలేషన్ వంటివి ఉన్నాయని క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు.
కొన్ని పనులు ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు వేయగా, మరికొన్ని అంచనాల మంజూరు ప్రక్రియలో ఉన్నాయని నందనీ సలారియా పేర్కొన్నారు. పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆమె చెప్పారు. కార్పోరేట్ పర్యావరణ భాద్యత కార్యాచరణలో భాగంగా మూడు సంవత్సరాల పాటు భారతీయ కొమ్ము ఖడ్గమృగం నకుల్ పోషనను ఐఓసీఎల్ స్వీకరించింది. దీనికి అనుగుణంగా రూ.3 లక్షల చెక్కును క్యూరేటర్కు ఐఓసీఎల్ అధికారులు అందజేశారు.