తిరుమల : తిరుమలకు మరింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లు, తాగునీటి కొళాయిలు, మరుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాలని సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యానమందిరానికి సంబంధించిన దాత, ఆర్కిటెక్ట్తో చర్చించి పనులు వేగవంతం చేయాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 24 గోశాలలను నోడల్ గోశాలలుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. వీటిని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు స్థానిక దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. స్థానికాలయాల్లో గోపూజ నిర్వహణ మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోశాలలో గోమాతకు ఇష్టమైన సంగీతం వినిపించేలా పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరులోపు ఎస్వీ గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పూర్తి చేయాలని, దాణాను ఇక్కడే తయారు చేసి జనవరి నుంచి బయట కొనుగోలు చేయడం నిలిపివేయాలన్నారు.