అమరావతి: ప్రముఖ సినీనటుడు మోహన్బాబు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కర్నూలులోని మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు వద్ద 11ఏండ్లుగా హెయిర్ స్టయిలిస్ట్గా పనిచేస్తున్న నాగశ్రీను అనే వ్యక్తిని కులంపేరుతో దూషించారని నాయీబ్రాహ్మణ కులాన్ని కించపరిచినందుకు వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మోహన్బాబు వైఖరిని నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాలో నాయీ బ్రాహ్మణ, బీసీ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నాగశ్రీనును ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి దుర్భాషలాడారని సంఘాల నాయకులు ఆరోపించారు. రూ.5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రిని చోరీ చేశాడని అక్రమ కేసులు బనాయించారన్నారు. మోహన్బాబు వైఖరిని నిరసిస్తూ నిన్న ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. మోహన్బాబు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.