అమరావతి: తప్పుడు విద్యా ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగం చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ ఉద్యోగ సంఘాల మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. తాను చదివింది ఇంటర్ అయినప్పుడు.. బీకాం చదివినట్లు ఎలా వెల్లడిస్తానని ప్రశ్నించారు. ఫోర్జరీకి పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని తెలిపారు. ఉద్యోగ పదోన్నతి కోసం బీకాం చదివినట్లు ఫోర్జరీకి పాల్పడినట్లు అశోక్బాబుపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాను ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతుండటంతో వైసీపీ ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నదని అశోక్ బాబు చెప్పారు. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యలకు దిగడమేనని.. సీఐడీతో విచారించాల్సిన కేసు కాదన్నారు. ఏ తప్పు చేయని తాను సీబీఐతో విచారణ చేయించినా భయపడనని తేల్చిచెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ చదివినట్టు తప్పుడు సమాచారాన్ని పొందుపరిచినట్లు ప్రచారం జరగడంపై అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తన సహచరుడైన సూర్యనారాయణ ఇదే రకమైన అభియోగాలను ప్రచారం చేశారని అశోక్ బాబు తెలిపారు. తాను ఈ విషయంలో అప్పుడే స్పందించానని, ఆ తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రాలేదన్నారు. అక్రమ పద్ధతుల్లో ఉత్తీర్ణత సాధించి సస్పెండ్ అయిన సూర్యనారాయణ.. ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయడానికే ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.