ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖా మంత్రిగా ఆర్కే రోజు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గండికోట- బెంగళూరు మధ్య బస్సు సర్వీసుపై మొదటి సంతకం చేశారు. ఇక రోజా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో ప్రత్యేక దిష్టి తీశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజా మాట్లాడుతూ… సీఎం జగన్ నమ్మకాన్ని తాను వమ్ము చేయనని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. వైసీపీ స్థాపన కంటే ముందు నుంచే తాను జగన్ అడుగు జాడల్లో నడిచానని గుర్తు చేసుకున్నారు. జగన్ లాంటి నేత దొరకడం తమ అదృష్టమని, సీఎం జగన్ను అన్ని రాష్ట్రాలూ మెచ్చుకుంటున్నాయని తెలిపారు.
సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, దేశ, విదేశీ టూరిస్టులకు అణువుగా పర్యాటక కేంద్రాన్ని తీర్చి దిద్దుతామని రోజా ప్రకటించారు. తన హయాంలో గ్రామీణ క్రీడలను బాగా ప్రోత్సహిస్తామని, క్రీడాకారులకు కూడా తగిన గుర్తింపు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఓ కళాకారిణిగా తోటి కళాకారుల సమస్యలు తనకు తెలుసని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని రోజా హామీ ఇచ్చారు.