అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై చర్చించాలని టీడీపీ (TDP) సభ్యులు పట్టుబట్టారు. వాయిదా తీర్మానానికి అనుమతించాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. విజిళ్లు వేస్తూ హంగామా సృష్టించారు. ఎర్రన్నాయుడు, అశోక్లు వీడియో తీయడంతో స్పీకర్ వారిద్దరిని సభముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ నోట్లో వీజిల్ పెట్టుకుని ఊదుతూ కనిపించారు. సైకో జగన్ పాలన పోవాలని, చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలంటూ పెద్దపెట్టున నినాలు చేశారు. సభలో గందరగోళం నెలకొడనంతో స్పీకర్ తమ్మినేని పది నిమిషాల పాటు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది.
స్పీకర్ పోడియం వద్ద విజిల్ ఊదుతున్న బాలకృష్ణను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదని, పార్టీలో తిప్పాలని సలహా ఇచ్చారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పాలన్నారు. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. దానిని తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు.
మీ బావ (చంద్రబాబు) జైల్లో ఉన్నాడు. అల్లుడు (లోకేష్) ఢిల్లీలో ఉన్నాడు. ఇదే మీకు సరైన సమయం.. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోవాలన్నారు. పార్టీని బతికించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని చంద్రబాబు సీటుపై నిల్చుని నిరసన తెలుపుతున్నారని, ఆ సీటు మీద కూర్చునే అవకాశం వచ్చిందంటూ బాలయ్యనుద్దేశించి అన్నారు. తన సలహా వినాలని.. లేదంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇంట్లోనే సీటీలు ఊదుకోవాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు.